నాణ్యత లోపంతో నిర్మాణ దశలోనే పగుళ్లు
మన్యంటీవీ, అశ్వారావుపేట:
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
పేదలకు స్వంత గృహం నిర్మాణం ఒక కళ. సొంతగూడు ఉంటే తిన్నా తినకపోయినా కంటినిండా నిద్రపోవచ్చనేది పెద్దల నానుడి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు గృహాలు కట్టించి దశలవారీగా ఇస్తుంది. ఈ క్రమంలో మండల పరిధిలోని కేశప్పగూడెం గ్రామంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 20 డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణ దశలోనే స్లాబులు కురుస్తూ దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణా లోపమో తెలియదు కాని ప్రారంభానికి నోచుకోకముందే డబుల్ బెడ్ రూమ్ గృహాలు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. రూ. 5 లక్షల పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు పూరి గుడిసెల కన్నా అధ్వానంగా ఉన్నాయని పలువురు ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అనేక నియమ నిబంధనలు విధించినప్పటికీ, ఎటువంటి మెటీరియల్ వాడాలో, ఏ విధంగా ఇల్లు కట్టి పేదవాడికి అప్పగించాలో కాగితాల పై వ్రాసుకున్నప్పటికీ అవన్నీ బుట్టదాఖలవుతూ కాసులకు కక్కుర్తిపడి, కాంట్రాక్టర్లు అధికారుల ధన దాహానికి లోనై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారని నాసిరకమైన ఇటుక, నాసిరకమైన సిమెంట్, నాసిరకమైన ఇసుక, నాసిరకమైన స్టీల్, వాడుతూ వర్షం వస్తే బీటలు వారి చెమ్మలు దిగడం కనిపిస్తున్నాయి. నాసిరకం ఇళ్లు నిర్మించడం ఇదంతా ఎవరినీ బాగుచేయడం కోసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కాంట్రాక్టర్లు ధన దాహం కోసం నాసిరకం ఇళ్లు నిర్మిస్తుంటే మరొకవైపు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ళ మత్తులో పడి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో నాణ్యతగా ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారుల ఎంపికలో కూడా పారదర్శకత పాటించడం లేదని, అనర్హులను అర్హులుగా గుర్తిస్తున్నారని, దీంతో అసలైన లబ్ధిదారులకు మొండిచేయి చూపిస్తున్నారని, అనేక చోట్ల అసలైన లబ్ధిదారులు ఆందోళన కూడా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలను పక్కదారి పట్టిస్తూ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై వారికి సహకరిస్తున్న అధికారులపై కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసి పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించే విదంగా చూడాలని పలువురు కోరుతున్నారు.
Post A Comment: