మన్యం టీవీ ఏటూరునాగారం: కరోనాతో మృతి చెందిన వారికి అంతిమ వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులే ముందుకురాని పరిస్థితుల్లో సమత ఫౌండేషన్ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కొవిడ్ తో చనిపోయిన వ్యక్తికి దగ్గరుండి దహన సంస్కారాలు చేయించి మానవత్వాన్ని చూపించారు.
ఏటూరు నాగారం మండలంలోని పప్కాపూర్ గ్రామానికి చెందిన బత్తుల మల్లమ్మ (80) మతిస్థిమితం లేని ఆమె కుమారుడు బత్తుల సమ్మయ్య(60) తల్లి కొడుకు ఇద్దరు ఆరు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. కరోనా పై అనుమానంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. హోమ్ ఐసోలాషన్లోనే ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారు. కాగా మల్లమ్మ (80) పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోయి 2 వ రోజు గడుస్తున్నా ఊరి వాళ్ళు గాని, బంధువులు గానీ ఎవరు రాకపోవడంతో, దిక్కుతోచని స్థితిలో మృతురాలి మనవరాలు దాసరి శ్రావణి సమత ఫౌండేషన్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి సహాయం కోరింది.
వెంటనే ఆ పౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ స్పందించి ఏటునాగారం లోని తమ ఫౌండేషన్ సభ్యుడు కొండగొర్ల రాజేష్ కి విషయం చెప్పి సంఘటనా స్థలానికి పంపించారు. రాజేష్ విషయాన్ని రెవిన్యూ , పోలీస్, గ్రామ పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, జేసిబి సహాయంతో దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయించారు.
Post A Comment: