నేడు కేంద్ర కేబినెట్ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కనీసం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి, మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే అవకాశముంది. దీంతో నేటి కేంద్ర కేబినెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తీవ్ర ఒత్తిడిలో ప్రధాని మోదీ!.
లాక్డౌన్తోనే కరోనా కట్టడి సాధ్యమని వైద్యనిపుణుల సూచన
కరోనా రెండో ప్రభంజనంలో వైరస్ వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్ట వేయలేకపోవడంతో.. ప్రజల్లో అసంతృప్తి! మరోవైపు బెంగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి. కరెన్సీ విలువలో ఆసియా దేశాలన్నింటిలోనూ మన రూపాయి పరిస్థితే ఘోరంగా ఉంది. దీంతో ప్రధాని మోదీపై అన్ని వైపుల నుంచీ తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా.. కరోనా కట్టడికి లాక్డౌనేపరిష్కారమంటూ దేశ, విదేశీ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు సైతం లాక్డౌన్ పెట్టే అంశాన్ని పరిశీలించాలంటున్నాయి. ప్రధానమంత్రి నియమించిన కొవిడ్-19 టాస్క్ఫోర్స్ కూడా లాక్డౌన్ విధించడమే మంచిదని ప్రధానికి సూచించింది. అయితే లాక్ డౌన్ విధించినా, విధించకపోయినా కూడా దేశం తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది లాక్డౌన్ విధించినప్పుడు ఏర్పడిన సంక్షోభం, విమర్శల నేపథ్యంలో..
మోదీ ఈసారి లాక్డౌన్పై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మళ్లీ అలాంటి విమర్శలను ఎదుర్కోవాలని ఆయన భావించట్లేదు. అందుకే.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగా వాడాలంటూ రెండు వారాల క్రితం సూచించారు. లాక్డౌన్ విధించాలని అందరూ అంటున్నప్పటికీ.. దానివల్ల ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంటుంది. విధించకపోతే ప్రజారోగ్య సంక్షోభం తప్పేలా లేదు. అలాగని ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తే.. ప్రజలంతా వైరస్ బారిన పడి అప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో, మోదీకి నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది.
Post A Comment: