మన్యం టీవీ, పాల్వంచ:
తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను,అనుమతి లేని నాసిరకం పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు.తెలంగాణా ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మరియు మాయ మాటలు చెప్పి రైతులకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు కొన్ని ఉత్తర్వులను జారీ చేసిందని పేర్కొన్నారు.ఇందులో భాగంగానే నకిలీ విత్తనాలను అమ్మేవారిపై మరియు సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేశామని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో నకిలీ విత్తనాలను,నకిలీ పురుగు మందులను రైతులకు విక్రయించే 43 మంది వ్యక్తులపై 23 కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసారు.
రైతులు,అధికారిక విత్తన సరఫరా దారులు,విత్తన కంపెనీ ప్రతినిధులు మరియు సామాన్య ప్రజలు ఎవరికైనా జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాల్సిందిగా కోరారు.రైతులను మోసం చేస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.ఇట్టి కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులపై పీడీ యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
Post A Comment: