నల్లగొండ : నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే.
నోముల భగత్ ప్రతి రౌండ్లోనూ మంచి ఆధిక్యం కనబరిచారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించగా, 10, 11, 14వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మళ్లీ మిగతా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది. కారు వేగానికి హస్తం, కమలం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.
ఈ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతు అయింది. టీఆర్ఎస్ సర్కార్ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతగా విమర్శించినప్పటికీ.. వారి మాటలను సాగర్ ఓటర్లు నమ్మలేదు. బండి సంజయ్ అబద్దాలను, అడ్డగోలు వాదనలను ప్రజలు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన టీఆర్ఎస్ సర్కార్ పక్షానే సాగర్ ప్రజలు నిలిచారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నోముల భగత్ను సాగర్ ఓటర్లు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. మూడు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని.. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్లో చేసి చూపెట్టింది. నియోజకవర్గంలోని చివరి ఎకరా వరకు నీరందించేందుకు పలు ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేసి సాగర్ రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్న గులాబీ పార్టీని సాగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మరోసారి ఇంటి పార్టీని ఆశీర్వదించి సీఎం కేసీఆర్కు జై కొట్టారు.
Post A Comment: