కోవిడ్ కారణంగా సూపర్స్టార్ మహేష్ బాబు నుంచి రావాల్సిన సినిమాకి రెండేళ్ళు గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ రెండేళ్ళ గ్యాప్ని భర్తీ చేసేందుకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే సర్కారు వారి పాట సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ - మహేష్ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేస్తామని తాజాగా వచ్చిన ప్రకటనలో అధికారకంగా వెల్లడించారు. ఇక సర్కారు వారి పాట సినిమాను 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు పరశురాం. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏసినిమాను విడుదల చేయలేకపోయాడు. అయితే దాదాపు రెండేళ్ళ గ్యాప్ను రెండు సినిమాలతో భర్తీ చేస్తుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు.
Post A Comment: