కమలం గూటికి మాజీమంత్రి
హైదరాబాద్ :
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఈటల ఢిల్లీ ప్రయాణానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ రాత్రికి బీజేపీ నేత బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ కిషన్రెడ్డి ఢిల్లీ వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి ఈటలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. అప్పటినుంచి ఈటల చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు పదక్షిణలు చేస్తున్నారు. అయితే బీజేపీ ఓ అడుగు ముందకేసి ఆయనతో ఆ పార్టీ నేతలు మంతనాలు కూడా జరిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని తాను కలిసింది నిజమేనని ఈటల రాజేందర్ అంగీకరించారు. ఒక్క కిషన్రెడ్డినే కాదని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్నీ కలిసినట్లు తెలిపారు.
ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించినట్లు సమాచారం. ‘‘రాష్ట్రంలో, టీఆర్ఎస్లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. ఈటల కూడా ఉద్యమ కారుడే. ఆయనకు అండగా నిలిచి న్యాయం చేయాలి’’ అని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండడం మంచిది కాదు. వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తాం’’ అని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు వెల్లడించాయి. దీంతోపాటు ఈటల వ్యక్తిత్వం, ప్రజాదరణకు సంబంధించిన నివేదికలు జాతీయ నాయకత్వం తెప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఈటల చేరికకు సంబంధించి పార్టీ అగ్రనాయకులు, సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Post A Comment: