మన్యం టీవీ, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంగారెడ్డి జిల్లాలోని పాషామైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గ్రీన్కో సంస్థ చేపట్టిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ పనులను మంగళవారం పరిశీలించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా చేసుకోవాలని, వివిధ ప్రాంతాల్లో పనిచేయని మెడికల్ ఆక్సిజన్ యూనిట్లను గుర్తించి, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుటలో భాగంగా, ఈ నిరుపయోగమైన యూనిట్ను పునరుద్ధరించుటకు గ్రీన్కో కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. టిఎస్ఐఐసి ఇచ్చిన సమన్వయం మరియు సాంకేతిక సహకారంతో స్వల్ప కాలంలో ఈ యునిట్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు తెలిపారు. పునరుద్ధరించబడిన ఈ యూనిట్ లో రోజుకు 40 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీని వలన మన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. త్వరలోనే ఈ యూనిట్ నందు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమై, ఆసుపత్రులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
బెల్జియం మరియు ఇతర దేశాల నుండి యంత్రాలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ వ్యవధిలో ప్లాంట్ను పునరుద్ధరించడానికి చేసిన కృషికి గ్రీన్కో కంపెనీ చైర్మన్ అనిల్ను ప్రధాన కార్యదర్శి ప్రశంసించారు.
ఈ పర్యటనలో ఐ.టి. మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టి.ఎస్.ఐ.ఐ.సి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నర్సింహారెడ్డి , టి.ఎస్.ఐ.ఐ.సి చీఫ్ ఇంజనీర్, శ్యామ్ సుందర్, గ్రీన్కో చైర్మన్ అనిల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: