జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
ఏరువాక కేంద్రం డాట్ సెంటర్ వ్యవసాయ సేవలను వెనుకబడిన ప్రాంతాలకు విస్తరింప చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నరసయ్య ను మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. అనంతరం ఈ మేరకు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, ములుగు జిల్లా లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రధాన సుగంధ పంటగా మిర్చి ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ప్రధాన ఆహార పంటగా వరి పంటలను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారని వీటికి తోడు ఇటీవల కాలంలో పండ్ల తోటలు, అపరాల సాగు విస్తీర్ణం సైతం క్రమేపీ పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి అవసరమైన సాగు సమాచారం , వ్యవసాయ సూచనలు, సలహాలు, సమయానుకూలంగా అందించే యంత్రాంగం లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏరువాక కేంద్రం నుండి ములుగు జిల్లా లో రైతులకు శిక్షణా తరగతులు, ప్రదర్శన క్షేత్రాలు, అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు, నూతన సాగు పద్ధతులు నూతన వంగడాలు మినికిట్లు రైతులకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రధానంగా మిర్చి లో విల్ట్ ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకునే వంగడాల విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇందుకోసం తమ " వికాస్ అగ్రి ఫౌండేషన్ " నుండి తగిన సహకారం అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని ఏరువాక కేంద్రం వార్షిక ప్రణాళిక లో ములుగు జిల్లా కు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ నర్సయ్య మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయ సేవల విస్తరణకు ఏరువాక కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తప్పనిసరిగా ఈ వ్యవసాయ సంవత్సరం ములుగు జిల్లా లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లో వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....
Post A Comment: