హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ కొరత తీరనుంది. వివిధ ఆస్పత్రుల్లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఒడిశా నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్కు భారీ డిమాండు ఏర్పడగా.. విమానాల ద్వారా ట్యాంకర్లను ఒడిశాకు పంపి తెప్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10 ఖాళీ ట్యాంకర్లను శుక్రవారం ఒడిశాకు పంపించారు. అవి అదే రోజు భువనేశ్వర్ నుంచి రవుర్కెలా, అనుగుల్ ఉక్కు కర్మాగారాలకు చేరాయి. ఆక్సిజన్ను నింపుకొని అర్ధరాత్రి తెలంగాణకు బయల్దేరాయి.
రవుర్కెలా, అనుగుల్ల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి సోమవారం హైదరాబాద్కు చేరాయి. మొదట 6, తర్వాత 4 ట్యాంకర్లు వస్తాయని అధికారులు తెలిపారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగం కోసం ఒక ట్యాంకర్ను ఇవ్వనున్నారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఒక్కో ట్యాంకర్ను పంపనున్నారు. ట్యాంకర్లు తీసుకొచ్చే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సుశిక్షతులైన ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా వాటిని హైదరాబాద్కు తీసుకొచ్చారు.
రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ను యుద్ధప్రాతిపదికన సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ట్యాంకర్లను మొదట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు పంపించి ప్లాంట్లలో నింపుతారు. అనంతరం జిల్లా ఆసుపత్రులకు పంపుతారు. మిగిలిన నిల్వలను ఎక్కడ అవసరమైతే అక్కడికి సిలిండర్లలో పంపిస్తారు. 200 మెట్రిక్టన్నుల నిల్వలు వారం, పది రోజుల వరకు కొరతను తీరుస్తాయని అధికారులు చెబుతున్నారు. మరోసారి విమానాల ద్వారా ఒడిశా లేదా చెన్నై, బళ్లారిలకు ట్యాంకర్లు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Post A Comment: