👉ఖమ్మంలో షాకింగ్ ఘటన
మన్యం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం:
రోడ్డు పక్కన ముళ్లపొదల్లో ఓ వ్యక్తి మహిళను దారుణంగా హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె గొంతునులిమి కిరాతకంగా హత్య చేసేందుకు యత్నించడంతో ఆమె విలవిల్లాడిపోయింది.
భార్యని హత్య చేసేందుకు భర్త యత్నం
గొంతునులిమి చంపుతుండగా వచ్చిన స్థానికులు
రాళ్లతో కొట్టి మహిళను కాపాడిన జనం
భర్తను చూసి జనం షాక్కి గురయ్యారు. గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయడంతో ఆమె విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ఆ రాక్షసుడిపై తిరగబడ్డారు. రాళ్లతో కొట్టి అతని బారి నుంచి ఆమెను రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ అత్యంత అమానుష ఘటన ఖమ్మంలో జరిగింది.
పట్టణంలోని టీఎన్జీవోస్ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ముళ్లకంపలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమెను చెట్ల లోపలికి తీసుకెళ్లి గొంతునులిమి కిరాతకంగా హత్య చేయబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పెద్దగా కేకలు వేశారు. అయినా పట్టువీడని రాక్షసుడు ఆమెను అంతం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన జనం మృగాడిని అడ్డుకునేందుకు రాళ్లతో దాడి చేశారు.
అయినా అతను పట్టువీడకుండా భార్యను అంతమొందించాలని చూశాడు. స్థానికులు రాళ్లతో కొట్టి ఎట్టకేలకు ఆమెను మృగాడి దాడి నుంచి ప్రాణాలతో రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చిలకకోయలపాడుకి చెందిన నాగేశ్వరరావు, నవ్య దంపతులుగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన భార్యను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
గత కొంతకాలంగా నాగేశ్వరరావు వేధింపులు తాళలేక భార్య దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పిల్లలను తీసుకోని ఏన్జీవోస్ కాలనీలో అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని వచ్చాడు. ప్లాన్ ప్రకారమే ఎన్జీవోస్ కాలనీలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు చూడడంతో నవ్య బతికి బయపడింది.
Post A Comment: