కనకరాజుతో కలిసి గుస్సాడీ నృత్యం చేసిన మంత్రి
కుమ్రం భీం - ఆసిఫాబాద్, జనవరి 30: గుస్సాడీ నృత్య గురువు, గుస్సాడీ రాజు పద్మశ్రీ కనకరాజు ను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మర్లవాయిలోని కనకరాజు నివాసాని వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసారు. జైనూర్ మండల ప్రజాప్రతినిదులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు నెత్తిన నెమలి పించం, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్య గురువు కనకరాజుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుస్సాడీ నృత్యం చేసారు.
ఆత్మీయ సన్మాన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మార్లవాయికి చారిత్రాత్మక గ్రామంగా పేరు ఉందని, ఇదే గ్రామానికి చెందిన గుస్సాడీ రాజు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఓ సాధరణ ఆదివాసీ గుస్సాడి కళాకారుడికి పద్మశ్రీ అవార్డు దక్కడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాన్ని తనదైన శైలిలో ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. కనకరాజుకు, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కనకరాజు కోరిక మేరకు మర్లవాయిలో త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామినిచ్చారు. ఈ గ్రామంలోమౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
గిరిజనుల అభ్నున్నతికి ఎంతో కృషి చేసిన హైమన్ డార్ఫ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని మర్లవాయి గ్రామస్థులు కోరగా.. ఈ విషయాన్ని సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి డార్ఫ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
అంతకుముందు కుమ్రం భీం, హైమన్ డార్ఫ్ విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, కలెక్టర్ రాహుల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: